పాకిస్థాన్ విద్యాసంస్థల్లో ఎవరూ తమ పేరును నమోదు చేసుకోవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇక్కడి విద్యార్థులను కోరింది. దీన్ని ఉల్లంఘించిన వారు భారత్లో పై చదువులకు, ఉద్యోగానికి అర్హత కోల్పోతారని స్పష్టంచేసింది. పై చదువుల నిమిత్తం ఎవరూ పాకిస్థాన్కు వెళ్ళొద్దని తేల్చి చెప్పింది. శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ సూచన చేశాయి. అయితే పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా భారత దేశానికి వచ్చి, భారతీయ పౌరసత్వం పొందినవారికి మినహాయింపునిచ్చాయి. ఉన్నత విద్యాభ్యాసం కోసం పాకిస్థాన్కు వెళ్లొద్దని సంబంధితులందరికీ చెప్తున్నట్లు ఈ సంయుక్త సర్క్యులర్ పేర్కొంది. భారత జాతీయులు/విదేశాల్లోని భారత పౌరులు పాకిస్థాన్లోని డిగ్రీ కళాశాలలు, విద్యా సంస్థల్లో పొందిన విద్యార్హతల ఆధారంగా భారత దేశంలో ఉద్యోగం లేదా ఉన్నత విద్యను పొందేందుకు అర్హులు కాదని పేర్కొంది. పాకిస్థాన్లో డిగ్రీ పొంది, భారత దేశానికి వలస వచ్చినవారు, వారి పిల్లలకు ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు ఉన్నట్లు తెలిపింది. అయితే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ముందుగా అనుమతి పొందవలసి ఉంటుందని తెలిపింది.