కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించి, తన, ఇతర విపక్షాల గొంతులను నొక్కేయాలని ఒత్తిడితో కూడిన వ్యూహాలు రచిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జూన్లో రాహుల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 50 గంటలపాటు ప్రశ్నించగా.. ఆయన తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. తాజాగా ఈ కేసులో యంగ్ ఇండియా కార్యాలయాన్ని కూడా ఈడీ అధికారులు తాత్కాలింగా సీజ్ చేశారు. ‘మీరు నేషనల్ హెరాల్డ్ గురించి మాట్లాడాల్సిందీ పోయి.. బెదిరిస్తున్నారు. కాస్త ఒత్తిడి తెస్తే సైలెంట్ అయిపోతామని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భావిస్తున్నట్లున్నారు. కానీ మేం బెదరం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోడీ, అమిత్ షా ఏం మాట్లాడినా.. మేము మా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం’ అని విలేకరులతో రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు తమ వ్యూహాన్ని రచించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాము ఎవరికి భయపడేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోవచ్చునని, ప్రజాస్వామ్యాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు పనిచేస్తూనే ఉంటానని తెలిపారు.