పీజే చంద్రశేఖరరావు ఆకాంక్ష
విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం : దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టుల ఐక్యత అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పీజే చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా రెండవ రోజు ప్రతినిధుల సభలో ప్రారంభోత్సవానికి ముందు అరుణ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనం తరం జరిగిన సభలో చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులు కాదు… ముందు కమ్యూనిస్టులు ఏకం కావాలని హితవు పలికారు. వామపక్షాల కలయిక కోసం జనం ఎదురుచూస్తున్నారని చెప్పారు. నాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎర్రజెండా నేడు ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఉధృత ఉద్యమాల ద్వారానే తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికలలో మోదీని నియంత్రించాలంటే ఇప్పటి నుంచే వామపక్ష ఐక్య ఉద్యమాలు బలపడాలని
ఆకాంక్షించారు. వామపక్షాలకు ఇది పరీక్షా సమయమని, సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని సూచించారు.