కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టాలని రాహుల్గాంధీపై ఒత్తిడి తెస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని నేతల్లో దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోగలిగే నేత రాహుల్ గాంధీ మాత్రమేనని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవిని మళ్లీ స్వీకరించాలని తాము ఆయనను ఒప్పిస్తామని చెప్పారు. ఖర్గే ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా, వారికి దేశవ్యాప్తంగా మద్దతు లభించాలన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు అందరూ మద్దతివ్వాలన్నారు. యావత్తు కాంగ్రెస్ పార్టీకి ఆ నేత ఆమోదయోగ్యుడై ఉండాలన్నారు. అదే విధంగా అందరి గుర్తింపు పొంది ఉండాలని తెలిపారు. తమ పార్టీలో అటువంటి నేత రాహుల్ గాంధీ మినహా మరొకరు లేరని చెప్పారు. కాంగ్రెస్లో చేరి, పార్టీ కోసం పని చేయాలని సోనియా గాంధీపై సీనియర్ నేతలంతా గతంలో ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రాహుల్ కూడా వచ్చి, పోరాడాలని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయ నేత వేరొకరు ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను చేపట్టడానికి రాహుల్ ఇష్టపడటం లేదని జరుగుతున్న ప్రచారంపై మాట్లాడుతూ, పార్టీ కోసం, దేశం కోసం బాధ్యతలు చేపట్టాలని ఆయనను కోరుతామని చెప్పారు. ఆరెస్సెస్ , బీజేపీలపై పోరాడుతూ, దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ‘భారత్ జోడో యాత్ర’ గురించి మాట్లాడుతూ, భారత దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి రాహుల్ గాంధీ అవసరమని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టాలని ఆయనను కోరుతామని, నిర్బంధిస్తామని, విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఆయనకు మద్దతుగా తాము నిలబడతామన్నారు. ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలును ఆమోదించవలసి ఉంది. ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో ఆదివారం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఎన్నికల షెడ్యూలును ఆమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తారు.