దేశంలో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు
ఓవైపు థర్డ్వేవ్ ముప్పు..మరోవైపు రోజుకో కొత్తరకం వేరియంట్లతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారి కొవిడ్ డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అసోంకు చెందిన ఓ మహిళా వైద్యురాలికి ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ‘వైద్యురాలికి ఒకే సారి రెండు వేర్వేరు వేరియంట్లు సోకిన కేసును గుర్తించామని, ఆమె రెండు మోతాదులు వ్యాక్సిన్ తీసుకున్నారని అసోం దిబ్రూగఢ్ జిల్లా లాహోవాల్ ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నోడల్ అధికారి అయిన బిశ్వాజ్యోతి బొర్కాకోటి తెలిపారు. ప్రయోగశాలలో ఆమె నమూనాలను పరిశీలించిన సమయంలో కొవిడ్ ఆల్ఫా, డెల్టా వేరియంట్ల ద్వారా ఒకే సమయంలో సోకినట్లు గుర్తించామన్నారు. ఆమె భర్తకు ఆల్ఫా వేరియంట్ సోకిందని తెలిపారు.డబుల్ వేరియంట్ను నిర్ధారించేందుకు రెండుసార్లు నమూనాలను సేకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. హోం ఐసోలేషన్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. కాగా, ఇటీవల బెల్జియంలో 90 ఏళ్ల వృద్ధ మహిళకు ఆల్ఫా, బీటా వేరియంట్లు సోకాయి. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించగా.. గత మార్చిలో ప్రాణాలు కోల్పోయింది.