సర్వే నివేదికలో వెల్లడి
భారత్లో ఇప్పటి వరకూ కరోనా వల్ల మరణించింది 4.14 లక్షల మంది అని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నా.. అంతకు పది రెట్లు ఎక్కువే ఉంటాయని తాజాగా చేసిన ఓ సమగ్ర సర్వే స్పష్టం చేసింది. దేశ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్తోపాటు సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు రీసెర్చర్లు ఈ సర్వే చేశారు. సర్వే రిపోర్ట్ మంగళవారం విడుదలైంది. దీని ప్రకారం, దేశంలో 2020 జనవరి నుంచి 2021 జూన్ మధ్య కరోనా కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 30 లక్షల నుంచి 47 లక్షల మధ్య ఉండొచ్చని పేర్కొంది.పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిసిపోవడం, సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్ల మరణించిన వారిని లెక్కలోకి తీసుకోకపోవడం వల్ల ఈ భారీ తేడా వచ్చి ఉండొచ్చని, దేశ విభజన తర్వాత ఇదే అతిపెద్ద విషాదం అని ఈ సర్వే పేర్కొంది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో జననమరణాలను నమోదు చేసే రిజిస్ట్రేషన్ వ్యవస్థ నుంచి సేకరించిన వివరాలు, దేశంలో వైరస్ ఎంత ప్రబలంగా ఉందో చెప్పే రక్త నమూనాలతోపాటు అంతర్జాతీయంగా కొవిడ్ మరణాల రేటు, ఏడాదికి మూడుసార్లు 9 లక్షల మందిపై చేసే ఆర్థిక సర్వే ఆధారంగా మరణాలను లెక్కగట్టారు.