గోదావరిఖని (పెద్దపల్లి) : పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. నేడు మోదీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కూనంనేని సాంబశివరావు రామగుండానికి బయలుదేరారు. పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి మంచిర్యాల జైపూర్ స్టేషన్కి తరలించారు. దీంతో సాంబశివరావు పోలీస్ స్టేషన్లోనే దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, అరెస్టులు అప్రజాస్వామికమని, తక్షణమే అదుపులోకి తీసుకున్నవారందరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో జిల్లాల్లో నిరసనలు తెలిపితే మోదీకి హానిజరుగుతుందా అని ప్రశ్నించారు. నిరసన తెలియజేయడం పౌరుల ప్రజాస్వామిక హక్కని చెప్పారు.అరెస్ట్ చేసిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.