కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్
విపక్షాలు ఉన్నదే వ్యతిరేకించడానికనే భావం వల్లే పార్లమెంటు సమావేశాలకు అంతరాయాలు ఏర్పడ్డాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం తమను తాము ప్రమోట్ చేసుకోవడానికే పరిమితమవుతూ, ప్రజాస్వామ్యాన్ని, మహాత్మాగాంధీల పేరును దుర్వినియోగం చేస్తోందన్నారు. గాంధీ పేరును గరిష్టంగా వాడుకుంటూ, గాంధీజీ ఆశయాలను సాకారం చేయడంలో మాత్రం మరిచిపోయారన్నారు. కెవాడియాలో గురువారం ప్రారంభమైన మూడు రోజుల గుజరాత్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెషన్లో రాజ్నాథ్ మాట్లాడుతూ, రాఫెల్ను కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఒక అంశం చేశాయని అన్నారు. రాఫెల్ విమానాలు ఇప్పుడు భారత్లో ల్యాండ్ అయ్యాయని, రాహుల్ మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఇంతవరకూ టేకాఫ్ తీసుకోలేదని వ్యంగ్యంగా అన్నారు. గతంలో 100 పైసలకు 16 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయనే ఫిర్యాదులు వచ్చావని, మోదీ హయాంలో డీబీటీ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలోకే సొమ్ములు నేరుగా చేరుతున్నాయని చెప్పారు.