కల్తీ మద్యం తాగి గుజరాత్ లో 42 మంది మృతి
గుజరాత్లో అక్రమ మద్యం, డ్రగ్స్ మాఫియా దందాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్లోని బోటాడ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఈ నెల 25న కల్తీ మద్యం తాగి 42 మంది మృతిచెందగా, మరో 97 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాఫియాలను అధికారంలో ఉన్న ఏ శక్తులు రక్షిస్తున్నాయని ప్రశ్నించారు. అక్రమ మద్యం వల్ల గుజరాత్ లో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని అన్నారు. బిలియన్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయని చెప్పారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులు పుట్టిన గడ్డపై ఈ విష వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరని ప్రశ్నించారు. వీరిని కాపాడుతున్న రాజకీయ శక్తులు ఎవరని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.