బండి సంజయ్, అమిత్షాలను ఏకిపారేసిన మంత్రి కేటీఆర్
మునుగోడులో నిర్వహించిన ‘భాజపా సమరభేరి’ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదివారం పాల్గొన్న విషయం తెలిసిందే. మునుగోడు పర్యటనలో భాగంగా తొలుత హైదరాబాద్ చేరుకున్న అమిత్షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట భాజపా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్షాకు చెప్పులు అందిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోను మంత్రి ట్విటర్లో షేర్ చేస్తూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.దిల్లీ ‘‘చెప్పులు’’ మోసే గుజరాతీ గులాములను..దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడిని..తెలంగాణరాష్ట్రం గమనిస్తున్నది అంటూ పేర్కొన్నారు. దిల్లీ పాలకులకు, గుజరాతి నాయకులకు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నాడని, తెలంగాణలో అటువంటి నాయకత్వం ఉందని బండి సంజయ్ను టార్గెట్ చేశారు. ఇక ఇదే సమయంలో దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నాడు కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.అంతేకాదు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్దంగా ఉన్నది అంటూ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న బీజేపీని తరిమికొడతారు అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనలో సీఎం కేసీఆర్ చేరలేదని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందు గుజరాతీ బిజెపి ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని తిరస్కరించిందని, ఆ రాష్ట్రంలో దీనిని నిలిపివేసింది అని పేర్కొన్న మంత్రి కేటీఆర్, మీ సొంత రాష్ట్రం గుజరాత్కు మంచిది కాకపోతే, ఫసల్ బీమా యోజన పథకం తెలంగాణ రాష్ట్రానికి మంచిది ఎలా అవుతుందంటూ అమిత్ షాను ప్రశ్నించారు. ఇటువంటి అసంబద్ధమైన కపటత్వాన్ని ప్రదర్శించటం మీకే చెల్లుబాటు అవుతుంది అంటూ అమిత్ షాను టార్గెట్ చేశారు. మునుగోడు సభలో అమిత్ షా మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.అంతేకాదు సీఎం కేసీఆర్ను రైతు వ్యతిరేకి అని సంబోధించడం ఈ శతాబ్దపు జోక్ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. కేసీఆర్ ఆలోచనలో ఉన్న రైతు బంధుని కాపీ చేసి పీఎం కిసాన్ గా పేరు మార్చింది ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆగ్రహం ఎదుర్కొన్న తర్వాత దేశంలోని రైతులకు ఎవరు క్షమాపణలు చెప్పారో చెప్పాలని, 700 మంది రైతుల విలువైన ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత రైతులను మన్నించమని అడిగింది ఎవరో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.