పుతిన్కు సూచించిన మోదీ
న్యూదిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, వొలోదిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. తొలుత జెలెన్స్కీతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ, అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ సంభాషించారు. పుతిన్తో మోదీ 50 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్లో మారుతున్న పరిణామాలను ఇద్దరూ చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ బృందాల మధ్య చర్చల పరిస్థితిని పుతిన్ భారత ప్రధాని మోదీకి వివరించారు. ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ… ప్రస్తుతం జరగబోయే రష్యా, ఉక్రెయిన్ చర్చలకు అదనంగా పుతిన్ నేరుగా జెలెన్ స్కీతో మాట్లాడాలని సూచించారు. కాల్పుల విరమణ నిర్ణయం ప్రకటించిన రష్యాను మోదీ అభినందించారు. ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాల్లోనూ, సుమే నగరంలోనూ మానవతా సాయానికి అనువుగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సుమే నగరంలో చిక్కుకున్న భారత పౌరులను వీలైనంత త్వరగా, క్షేమంగా తరలించడంపై కూడా పుతిన్కు మోదీ వివరించారు. ఈ క్రమంలో, భారతీయుల తరలింపునకు అన్ని విధాలుగా సహకరిస్తామని పుతిన్, ప్రధాని మోదీకి భరోసా ఇచ్చారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి.
ఉక్రెయిన్కు కృతజ్ఞతలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ 35 నిమిషాల పాటు మాట్లాడారు. భారత పౌరుల తరలింపులో సాయం చేయడంపై జెలెన్స్కీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ కొందరు భారత పౌరులు ఉక్రెయిన్లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రతక్ష చర్చలు జరుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్యమార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.