దేశంలో భారత్ బంద్కు భారీగా మద్దతు లభిస్తోంది. దిల్లీ నుండి గల్లీ వరకు కార్మికులు, కర్షకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) ఈ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్ మధ్యాహ్నం 4 గంటల వరకూ కొనసాగనుంది.
కర్ణాటకలో భారత్ బంద్
కర్ణాటకలోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. కలబురిగిలో బస్స్టాండ్ ఎదుట పలు సంస్థలు రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
తమిళనాడులో..
తమిళనాడులోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ రోజు రైతు సంస్థలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతుగా చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలో పోలీసు బారికేడ్ను నిరసనకారులు తొలగించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో వర్షాలు కురుస్తున్నా.. కొనసాగుతున్న ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ లో గులాబ్ తుపాన్ ధాటికి వర్షాలు కురుస్తున్నా…. వామపక్ష, ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత్ బంద్ కు సంఫీుభావం తెలియజేయడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమిత అయ్యాయి. దీంతో ఏపీలోని అన్ని జిల్లాల్లో బస్టాండులు నిర్మాణుషంగా మారిపోయాయి. మరోవైపు, బంద్ గురించి అవగాహనలేని పలువురు సామాన్యజనం మాత్రం బస్టాండుల్లో పడిగాపులు కాస్తూ, ఏమీ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కేరళలో శాంతియుతంగా బంద్
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువస్తున్న కర్షక, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేపడుతున్న ఆందోళనలకు కేరళ ప్రభుత్వం మద్దతునిచ్చింది.
బీహార్లో..
బీహార్లో ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ భారత్ బంద్లో పాల్గొంది. హాజీపూర్లో ఆర్జేడీ నేత ముఖేష్ రోషన్, ఇతర కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో హాజీపూర్-ముజఫర్పూర్ రహదారిపైన ట్రాఫిక్ నిలిచిపోయింది.
హర్యానాలో
హర్యానాలో రైతులు పలు రోడ్లను దిగ్బంధించారు. బహుదూర్గడ్ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్న రైతులు రైల్వేట్రాక్లపై నినాదాలు చేశారు. బహుదూర్గఢ్ బార్ అసోసియేషన్ కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించింది. అక్కడ న్యాయవాదులు నేడు విధులకు గైర్హాజరయ్యారు.
పంజాబ్లో శాంతియుతంగా నిరసనలు
పంజాబ్లో భారత్ బంద్కు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు జరుగుతున్నాయి. అమృత్సర్లోని దేవీదాస్పురలాలో రైతులు రైల్వే ట్రాక్లపై ఆందోళనలు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పంజాబ్లో పలు రోడ్లపై అన్నదాతలు బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
పశ్చిమబెంగాల్లో..
పశ్చిమబెంగాల్లో భారత్బంద్కు ప్రజానీకం సంఫీుభావం తెలిపింది. దీంతో పలుచోట్ల నిరసలు చోటుచేసుకున్నాయి.