ప్రధాని మోదీ
న్యూదిల్లీ : స్వాతంత్య్రం సాధించి ఈ ఏడాది 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో భారతీయులంతా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’ అనే మంత్రంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. మనసులో మాట (మన్ కీ బాత్) 79వ ఎడిషన్లో భాగంగా ఆదివారం మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం జరగనున్న కార్గిల్ దినోత్సవాన్ని ప్రస్తావించారు. ముప్పు ఇంకా తొలగలేదని చెబుతూనే కార్గిల్ విజయం భారత సైనికుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. ప్రస్తుత పండుగలు, పర్వదినాల కాలంలో ప్రజలంతా.. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్న సంగతిని గుర్తెరిగి ప్రవర్తించాలని సూచించారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత క్రీడాకారులు త్రివర్ణ పతకాన్ని చేత బూని నడుస్తూ ఉంటే తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఉప్పొంగిపోయారని, వారికి విజయం లభించాలని దేశ ప్రజలంతా కోరుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. భిన్న సంస్కృతులు, ఆచారాలకు నిలయమైన భారత్ను ఏకం చేసేందుకు జాతి పిత మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క భారతీయుడు ముందుండి నాయకత్వం వహించాలన్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు మద్దతిచ్చేందుకు ‘విక్టరీ పంచ్’ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. అందరూ విక్టరీ పంచ్ను షేర్ చేయాలని పేర్కొన్నారు.
సోమవారం కార్గిల్ దివస్ సందర్భంగా జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలని ప్రధాని అన్నారు. కార్గిల్యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో యువత వినడంపై హర్షం వెలిబుచ్చారు. వివిధ రంగాల్లో.. విశేష కృషి చేసిన సామాన్య ప్రజలను మోదీ ప్రశంసించారు. ఆపిల్ సాగులో మణిపూర్కు చెందిన ఎరోనాటికల్ ఇంజినీర్ టీఎస్ రింగ్ఫమీ.. యాపిల్ సాగు చేస్తూ.. రైతులకు ఆ సేద్యంలో మెలకువలు నేర్పించటాన్ని మోదీ ప్రశంసించారు. కరోనా వాక్సిన్ తీసుకుంటే పూరీ ఫ్రీ అంటూ చండీగఢ్కు చెందిన ఓ చిరు వ్యాపారి.. కొవిడ్ వాక్సిన్ తీసుకున్నవారికి సైకిల్పై తిరుగుతూ.. ఉచితంగా పూరీలు ఇవ్వటాన్ని మోదీ ప్రశంసించారు. కూలీ స్థాయి నుంచి యూట్యూబర్గా ఎదిగిన ఒడిశాకు చెందిన ఐసాక్ ముందాను మోదీ ప్రశంసించారు. ముందా ఓ కూలీ. కానీ ఇప్పుడు యూట్యూబ్లో స్టార్గా మారాడు. వివిధ రకాల వంటలు, పల్లె జీవితంపై వీడియోలు తీస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ముందాకు.. ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 న వస్తుంది అని పేర్కొన్న ప్రధాని, చేనేత ఉత్పత్తులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు అని, వాటిని కొనుగోలు చేయాలని దేశ ప్రజలను కోరారు. ఖాదీ ఉత్పత్తుల గురించి తన నెలవారీ రేడియో ప్రసంగాల్లో తరచుగా ప్రస్తావించడంతో, 2014 నుండి వారి డిమాండ్ చాలా రెట్లు పెరిగిందని మోదీ చెప్పుకొచ్చారు.