పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనపై పెంపు లేదు
మిగిలిన పథకాలపై 1.1 శాతం వరకు పెరుగుదల
జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త రేట్లు
చిన్న మొత్తాల పొదుపు పథకాలలో (పోస్టాఫీసు పథకాలు) ఇన్వెస్ట్ చేసే వారికి కేంద్ర సర్కారు తీపి కబురు చెప్పింది. వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు పెంచింది. జనవరి 1 నుంచి నూతన రేట్లు అమల్లోకి వస్తాయి. మూడు నెలల పాటు, 2023 మార్చి వరకు ఇవే కొనసాగుతాయి. ప్రతి మూడు నెలలకు రేట్లను సవరించే విధానం అమల్లో ఉంది. పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్ రేటులో ఎలాంటి మార్పు లేకుండా 4 శాతంగానే ఉంది. అలాగే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (5.8 శాతం), పీపీఎఫ్ (7.1 శాతం), సుకన్య సమృద్ధి యోజన (7.6) పథకాలపై రేట్లను పెంచకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లను కొనసాగించింది. ప్రస్తుత రేటు ప్రకారం కిసాన్ వికాస పత్రలో పెట్టుబడి 123 నెలలకు డబుల్ అవుతుంటే, కొత్త రేటు ప్రకారం 120 నెలలకే డబుల్ కానుంది.