ప్రమాణ స్వీకారానికి రండి: మాన్
చండీగఢ్: మార్చి 16వ తేదీన జరిగే తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్సింగ్ మాన్ రాష్ట్ర ప్రజలకు సోమవారం విజ్ఞప్తి చేశారు. పురుషులు పసుపు తలపాగా, మహిళలు పసుపు శాలువా ధరించి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. విప్లవ యోధుడు భగత్సింగ్ స్వగ్రామం`నవాన్ షహర్ జిల్లా ఖత్కర్ కలాన్లో మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భగత్సింగ్ కలలు కన్న పంజాబ్ను నిర్మిద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నేనొక్కడినే కాదు. నాతోపాటు మూడు కోట్ల పంజాబీయులు ప్రమాణ స్వీకారానికి రావాలి. మనమంతా భగత్సింగ్ కలలు పరిపూర్తి చేద్దాం. మార్చి 16వ తేదీ నుంచి ఆయన ఆలోచనలను ఆచరణలో పెడదాం’ అని ట్వీట్టర్ ద్వారా వీడియో సందేశం పంపారు. ‘నేనొక్కడినే ముఖ్యమంత్రిని కావడం కాదు. మీరంతా ముఖ్యమంత్రులు కావాల్సిందే. ఇది మీ సొంత ప్రభుత్వం’ అని మాన్ పేర్కొన్నారు. ‘పసుపు రంగ తలపాగా ధరించాలని నా సోదరులు, మిత్రులకు, అదే రంగు శాలువా కప్పుకొని రావాలని సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా, మనమంతా ఆరోజు ఖత్కర్ కలాన్ను పసుపుమయం చేద్దాం’ అని ఆయన ఆ సందేశంలో కోరారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించింది. ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాన్ గెలుపొందారు.