కొవిడ్ టీకాల ఎగుమతులపై భారత్ నిర్ణయం అత్యంత కీలకం : డబ్ల్యూహెచ్ఓ
అక్టోబర్లో కొవిడ్ టీకాలను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా.. కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్ టీకాలను అందించి భారత్ అండగా నిలిచిందని పేర్కొన్నారు. రెండోదశలో మహమ్మారి విజృంభణతో టీకాల ఎగుమతిని నిలిపివేయగా.. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు అందించాలని నిర్ణయించింది. భారత్లో అదనంగా ఉన్న కొవిడ్ టీకాలను ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు.