Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ మద్దతు లేకుండా అదానీ వ్యాపారమే లేదు

. రైల్వేల ప్రైవేటీకరణకే వందే భారత్‌ రైళ్లు
. విశాఖ ఉక్కుపై కేసీఆర్‌ నిర్ణయం హర్షణీయం
. సీపీఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర – హైదరాబాద్‌: రైల్వేస్టేషన్లు, రైళ్లు, పోర్టులను ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన తర్వాత, వాటిని తిరిగి కార్పొరేట్‌ శక్తులకు అమ్మేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అప్రజస్వామిక విధానాలను ‘బీజేపీి హఠావో – దేశ్‌ బచావో ’ నినాదంతో ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళతామని వెల్లడిరచారు. సీపీిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి మే 15 వరకు నిర్వహించే పాదయాత్ర కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సోమవారం ఇక్కడి మక్దూం భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ లాభాలను చూపించి, ప్రైవేటుపరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ రైలును తీసుకొచ్చిందని విమర్శించారు. ఒక వైపు ఎయిర్‌ ఇండియాను ప్రైవేట్‌పరం చేసి, మరోవైపు ప్రజా సొమ్ముతో వంద విమానాశ్రయాలను ఎవరి కోసం నిర్మిస్తున్నారని మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. విమానాశ్రయాలను కూడా కార్పొరేట్లకు అప్పగిం చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రూ.15 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేవలం రూ.35 కోట్ల అప్పును కూడా కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. ప్రధాని పదవికి, చదువుకు సంబంధం లేకపోయినా చదువుకున్న డిగ్రీ అంశంలో కూడా మోదీ అబద్దాలు చెబుతూ అనైతికతకంగా వ్యవహారిస్తూ ప్రధాని స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. అదానీ బంగారుచిలుక అని, కూపీలాగితే మోదీ, అమిత్‌ షా బయటకు వస్తారని, అందుకే అదానీని రక్షించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని నారాయణ విమర్శించారు. మోదీ మద్దతు లేకుండా అదానీ వ్యాపారమే లేదన్నారు.
విశాఖ స్టీల్‌ ప్రభుత్వ రంగ సంస్థను తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని నారాయణ తెలిపారు. బొగ్గు, ఉక్కుకు సంబంధంవున్నందున సింగరేణి సంస్థ ద్వారా నడిపంచవచ్చని కేసీిఆర్‌ ముందుకురావడాన్ని ప్రత్యేకంగా అభినంధించారు. ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తే, ప్రభుత్వరంగ సంస్థను కాపాడినట్టేనని, ఇలాంటి ప్రయత్నాన్ని తాము స్వాగతిస్తూనే సంస్థ అభివృద్ధికి, కార్మిక వర్గ సంక్షేమానికి కృషి చేస్తామని హమీనిచ్చారు. బంగారుబాతును అదానీ తన్నుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లొంగిపోయినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం జాతి సంపదకు, ఆపదలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు వీలుగా ఉంటుందని నారాయణ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును కొనుగోలు చేయాలని, అ ందుకు తాము పూర్తిగా మద్దతునిస్తామని చెప్పారు. రూ.3 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కును కేవలం రూ. 30 వేల కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం జరగడం అన్యాయని నారాయణ అన్నారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ప్రధాని మోదీ అవినీతి గురించి మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. దేశాన్ని సర్వనాశనం చేసే మోదీలాంటి విపత్కర మైన ప్రధానిని తాము ఎప్పడూ చూడలేదన్నారు.తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత వరకు నిధుల సహాయం చేసింది?, రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఎంత వరకు తీసుకున్నారో స్పష్టం చేయాలని, దీనిపై తాను ఎక్కడైనా, మీడియా సమక్షంలోనైనా చర్చకు సిద్ధమేనని బీజేపీి నేతలకు కూనంనేని సవాల్‌ విసిరారు. ఈ నెల 14 నుంచి మే 15 వరకు ‘‘బీజేపీ హఠావో – దేశ్‌ బచావో’’ నినాదంతో ప్రజల వద్దకు సీపీఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నర్సింహ, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img