ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే కాన్పూర్కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో కరెన్సీ నోట్ల గుట్టలు బయటపడిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరో వ్యాపారి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ అలియాస్ పంపీ జైన్ నివాసంలో ఇంటిపై శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. సమాజ్వాదీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అయన 2022 కోసం 22 పువ్వులతో తయారు చేసిన సమాజ్వాదీ పెర్ఫ్యూం విడుదల చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంకా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ‘పేర్ల గందరగోళం’ వల్లే పీయూష్ జైన్ ఇంట్లో సోదాలు జరిపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.
పుష్పరాజ్ జైన్ ఇల్లు కూడా పీయూష్ జైన్ ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది. ఈయన నిత్యం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఇది కాకుండా, కన్నౌజ్లోని మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి మాలిక్ మియాన్ ఆవరణలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గత సారి కూడా పుష్పరాజ్ రహస్య స్థావరాలపైనె ఐటీ శాఖ దాడులు చేసేందుకు సిద్ధమైంది. అప్పుడు రహస్య సంకేతంగా పి కోసం బృందం వెతుకులాట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఐటీ టీమ్ అనుకోకుండా పీ అంటే పుష్పరాజ్ బదులు పీ అంటే పీయూష్ జైన్ ఇంటికి చేరుకుంది. కాగా శుక్రవారం ఉదయం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కన్నోజ్తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా తమ పార్టీ నేతలను టార్గెట్ చేశారని సమాజ్వాదీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్లో ఫర్ఫ్యూమ్ వ్యాపారుల పన్ను ఎగవేత కేసులు అధికారుల తనిఖీలు కలకలం సృష్టిస్తున్నాయి.