నోయిడా: ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిరచాలని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విజ్ఞప్తి చేశారు. యోగి ఐదేళ్ల దుష్టపాలనకు చరమగీతం పాడి దిల్లీ పాలకులకు స్పష్టమైన సంకేతాలు పంపాలని కోరారు. బీజేపీ ప్రభుత్వ తిరోగమన విధానాలను ఎలుగెత్తి చాటాలని విన్నవించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మొదటిసారిగా యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నోయిడా నుంచి మంగళవారం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలను తక్కువ అంచనా వేయవద్దని, యూపీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రతిబింబిస్తాయని థరూర్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నోయిడా కాంగ్రెస్ అభ్యర్థి పంఖురి పాథక్కు మద్దతుగా థరూర్ నగర ప్రజలతో ముఖాముఖి ముచ్చటించారు. ‘మీరు వేసేది ఒక్క ఓటే..కానీ అయితే దాని ప్రాముఖ్యత అనేక రూపాల్లో కనిపిస్తుంది’ అని థరూర్ పేర్కొన్నారు. ‘అసెంబ్లీలో మీ వాణిని ఎవరైతే వినిపిస్తారో.. మీ నగర ప్రయోజనాల కోసం ఎవరైతే పోరాడుతారో వారికి మీ మొదటి ఓటు వేయండి’ అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారికి రెండో ఓటు వేయండి. తిరోగమన విధానాలు అమలు చేస్తున్న దిల్లీ పాలకులకు స్పష్టమైన సంకేతాలు పంపడానికి మూడో ఓటు వేయండి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ అతిపెద్దరాష్ట్రమని, ఇక్కడి ఫలితాలు దేశమంతా ప్రతిబింబిస్తాయని థరూర్ గుర్తుచేశారు.