బ్రిటిష్ కాలం నాటి చట్టాలు అవసరమా? : సుప్రీం
రాజద్రోహం కేసులు పెట్టడానికి వీలు కలిగిస్తున్న భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ ‘124-(ఏ)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. సెక్షన్ 124-(ఏ)పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని.. మేజర్-జనరల్ ఎస్.జి. వోంబట్కెరే (రిటైర్డ్) దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజద్రోహం చట్టం బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టం.. స్వాతంత్య్ర సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీష్ వారు ఈ చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు. భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దీన్ని ఉపయోగించారని, ఇప్పుడు మనకు స్వాత్రంత్యం వచ్చి 75ఏళ్లు అవుతోంది. ఇప్పుడు కూడా దేశద్రోహం చట్టం అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ చట్టం దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అని ప్రశ్నించారు. ఈ సెక్షన్ చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటన్నింటినీ ఒకేసారి విచారిస్తామని పేర్కొన్నారు.