రైతులు ఆందోళన విరమించి ఇండ్లకు తిరిగివెళ్లాలి
వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో రైతులు తమ ఆందోళనను విరమించుకొని ఇంటికి వెళ్లాలని కోరుతున్నానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం మీడియాతో వెల్లడిరచారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని, పంటల వైవిధ్యం, జీరో బడ్జెట్ ఫార్మింగ్, మద్దతు ధర యంత్రాంగాన్ని పటిష్టం చేయడం వంటి పలు అంశాలపై ఆ కమిటీ చర్చిస్తుందని తెలిపారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఈ కమిటీల్లో ఉంటారని చెప్పారు.రైతులు పంట వ్యర్ధాలను దగ్ధం చేయడాన్ని నేరపూరిత చర్యగా చూడరాదన్న రైతు సంఘాల డిమాండ్ను కూడా ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటుతో ఎంఎస్పీపై రైతుల డిమాండ్ కూడా నెరవేరినట్టేనని మంత్రి తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా రైతులు నిరసనలు కొనసాగించడంలో ఎలాంటి అర్ధం లేదని అన్నారు. వారంతా తమ ఆందోళనను విరమించి ఇంటికి వెళ్లాలని కోరుతున్నానని చెప్పారు. రైతుల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.