స్విమ్స్ నుంచి ముఖ్య సాక్షి రంగన్న తరలింపుపై ప్రచారం
ివిశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్నను హైదరాబాద్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిసింది. వివేకా హత్యలో రంగన్న కీలక సాక్షిగా ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారని 164 స్టేట్మెంట్లో రంగన్న చెప్పారు. ఈ కేసులో ఏ1 నిందితుడు దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. అయితే తన ప్రాణాలకు హాని ఉందని దస్తగిరి ఇప్పటికే పదేపదే చెప్పారు. ఇప్పటికే అనుమానాస్పద రీతిలో కల్లూరు గంగాధర రెడ్డి మృతి చెందాడు. రంగన్నను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటి నుంచి వైద్యం పేరుతో ఆయన్ను చంపేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రంగన్నకు సీబీఐ అధికారులు 1G1 భద్రత కల్పించారు. అయినప్పటికీ తిరుపతి స్విమ్స్లో రంగన్నకు భద్రత లేదని భావిస్తున్న అధికారులు, ఆయన్ను ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారని ప్రచారం జరుగుతోంది. తిరుపతి నుంచి 108 వాహనంలో కడప వరకు తీసుకువెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్కు తరలిస్తారని సమాచారం. రంగన్నకు అందించిన వైద్య వివరాలపై బులిటెన్ను స్విమ్స్ ఇంతవరకు విడుదల చేయలేదు. అలాగే రంగన్నను కచ్చితంగా ఏ ఆసుపత్రికి, ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంలోనూ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. మరోపక్క వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సీబీఐ ఎదుట లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై ఏప్రిల్ 27న విచారణ జరిపిన కోర్టు… గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. మే 5వ తేదీలోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. లేనిపక్షంలో సీబీఐ… గంగిరెడ్డిని అదుపులోకి తీసుకోవాలని సూచించింది. అలాగే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఉన్నందున, అప్పటివరకు మాత్రమే ఆయన్ను రిమాండ్కు తరలించాలని, ఆ తర్వాత బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.