Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనపై స్పందించిన అమెరికా

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం పై అమెరికన్‌ టైకూన్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. మస్క్‌ ప్రకటనపై బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ స్పందించారు. భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని తెలిపారు. ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్‌ గతంలో మాట్లాడారని, విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.కాగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్‌ ప్రయత్నాలకు చైనా వంటి దేశాలు మోకాలడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై అమెరికన్‌ టైకూన్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ ఏడాది జనవరిలో ప్రస్తావించారు. ఈ మేరకు ఐరాస విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ భూమ్మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ.. భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్నారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ఇదే సమస్యకు కారణమవుతోంది. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అంటూ తన అభిప్రాయాన్ని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ట్వీట్ పై మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, భద్రతా మండలిలో భారత్‌కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఐదు దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఐదింటిలో నాలుగు మద్దతు ఇస్తున్నా.. చైనా మాత్రం భారత్‌ ప్రయత్నాలకు అడ్డుపడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img