విశాలాంధ్ర/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం వుంది. ఈలోగానే రాజకీయ నాయకులు జంపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఆయారామ్ గయారామ్ల జాబితా షురవైనట్లుగా కన్పిస్తోంది. ఇందులో భాగంగానే అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం వుందని భావిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, నాయకుడు జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరనున్నట్లుగా తెలిసింది. గత రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందింది. తెలంగాణలో రెండుమూడు సీట్లు గెలిచేసరికి బీజేపీయే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని కొన్ని వర్గాలు భావించాయి. అయితే జూపల్లి కృష్ణారావు అనూహ్యంగా బీజేపీని కాదని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకోవడం కొత్త పరిణామం. మొన్నటి వరకు బీజేపీ పార్టీలో చేరతారని అందరూ భావించినా.. తన పాత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే.. జూపల్లి కృష్ణరావు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే టీఆర్ఎస్లోకి వచ్చారు. జూపల్లి కృష్ణారావుతోపాటు మరికొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. బీజేపీ వరంగల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మహబూబ్నగర్ మాజీ నెమ్మెల్యే ఎర్ర శేఖర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. (Story: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి!)