ఇండో పసిఫిక్ సెంటర్ నివేదికలో వెల్లడి
హిమాలయాల్లో దొరికే అత్యంత అరుదైన మూలికల కోసమే చైనా సైన్యం ఇటీవల సరిహద్దులు దాటొచ్చిందని ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్(ఐపీసీఎస్ సీ) నివేదిక వెల్లడిరచింది.హిమాలయన్ గోల్డ్ గా పిలిచే ఈ గొంగళి పురుగు ఫంగస్ ను మందుల తయారీకి ఉపయోగిస్తారని పేర్కొంది. పుట్టగొడుగులలో అరుదైన రకానికి చెందిన ఈ మూలికను మన దేశంలో కీడా జాడీగా, చైనా, పాక్ లలో యర్సగుంబాగా పిలుస్తారని తెలిపింది. అత్యంత అరుదుగా లభించే ఈ మూలికలో అద్భుతమైన ఔషధ విలువలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి తయారీ, ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ వన్ దేశం చైనానే. దీని విలువ బంగారం కంటే ఎక్కువని,10 గ్రాముల కార్డిసెప్స్ ధర సుమారు 700 డాలర్లు (రూ. 56 వేలు) ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత నాణ్యమైన ఫంగస్ కిలో లక్షల్లోనే పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు. భారత్లోని హిమాలయ ప్రాంతంతోపాటు చైనా నైరుతిలోని క్వింగై – టిబెట్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో ఈ కార్డిసెప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. 2022 నివేదిక ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ విలువ 1072.50 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనాదే అగ్రస్థానం. అయితే, అత్యధికంగా ఉత్పత్తయ్యే క్వింగై ప్రాంతంలో గత రెండేళ్ల నుంచి వీటి సాగు క్షీణించింది. ఇదే సమయంలో గత దశాబ్దం కాలంగా వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వీటిని అన్వేషించుకుంటూనే అరుణాచల్లోకి చైనా సైనికులు చొరబడినట్లు ఐపీసీఎస్సీ నివేదిక తెలిపింది. చైనాలో కార్డిసెప్ప్ ఉత్పత్తి 2010లో లక్షన్నర కిలోల ఉండగా.. 2018కి 41,200 కిలోలకు పడిపోయింది. గత రెండేళ్లలో ఇది మరింత క్షీణించింది. అత్యంత మొండి రోగాలను నయం చేసే గుణం కలిగిన ఈ ఫంగస్ హిమాలయాల్లోనే లభిస్తుంది. హిమాలయాలకు దగ్గరగా ఉన్న 80 శాతం మంది జనాభా ఈ ఫంగస్ అమ్మకంపై ఆధారపడతారని నిపుణులు చెబుతున్నారు.కార్డిసెప్స్ పుట్టగొడుగు మంచి ఆహారంగా ప్రసిద్ధి చెందింది. ఇది హానికారక కీటకాలను నాశనం చేస్తుంది. మాంసంలో చనిపోయిన కీటకాల స్థానంలో కార్డిసెప్స్ ఫంగస్ వృద్ధి చెందుతుంది. కార్డిసెప్స్లోని కార్డిసెపిన్ అనే బయోయాక్టివ్ మాలిక్యూల్ గొప్ప చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏదో ఒక రోజు కొత్త యాంటీవైరల్, యాంటీకాన్సర్ చికిత్సగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.