లఖింపూర్ ఘటనపై సుప్రీం
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. నలుగురు రైతులు సహా ఎనిమిది చనిపోయిన ఈ ఘటనలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి ధర్మాసనం ఆరా తీసింది. ఈ దుర్ఘటనకు కారణమైన వారిని ఎంత మందిని గుర్తించారు? ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని ధర్మాసనం యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సవివరమైన నివేదికను శుక్రవారం సమర్పించాలని ఆదేశించింది. ‘ఇది దురదృష్టకరమైన సంఘటన.ఈ కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు ఎంత జరిగిందో, ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదైందో చెప్పండి. అంతే కాదు ఈ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు, కేసు వివరాల్ని మాకు ఇవ్వండి’ అని కోర్టు ప్రశ్నించింది. ఈ ఘటనలో మృత్యువాత పడిన రైతు లవ్ప్రీత్ సింగ్ తల్లి చికిత్స కోసం యూపీ ప్రభుత్వం అవసరమైన సాయం చేయాలని ఆదేశించింది. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రా కారుతో దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. ఇది యూపీనే కాకుండా మొత్తం దేశాన్ని కుదిపివేసింది. దీనిపై విచారణ కోసం ఇప్పటికే యూపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ విచారణ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది.