Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే విశాఖ నుంచే పాలన!

. ఉగాదికి శ్రీకారం?
. సీఎం జగన్‌ బసకు ఏర్పాట్లు
. వైసీపీ నేతల్లో ఎమ్మెల్సీ ఎన్నికల భయం

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: త్వరలో విశాఖనుంచి పాలన ప్రారంభిస్తానని పెట్టుబడుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌) సందర్భంగా సీఎం జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఉగాది నుంచి విశాఖనే ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. విశాఖ నగరంలో సీఎం ఉండేందుకు నివాస భవనం సిద్ధమైందా? సీఎం ఒకవేళ విశాఖకు వస్తే అమరావతిలో అడుగుపెట్టరా? లేదంటే కొన్ని రోజులు విశాఖలో, మరికొన్ని రోజులు అమరావతిలో ఉంటారా? ఒక రాజధాని… వంద అనుమానాలపై ఇప్పుడు సరికొత్త ప్రచారం మొదలైంది. సీఎం జగన్‌ విశాఖకు రావడం ఖాయం అంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే ఆయన వారానికి రెండు రోజులు మాత్రమే విశాఖలో ఉండబోతున్నారట. సోమవారం ఉదయం వచ్చి సోమ, మంగళవారాలు విశాఖలో బస చేయనున్నారట. ఈ రెండు రోజులు విశాఖ నుంచే పరిపాలన ఉండబోతోందట. అధికారులతో సమీక్షలు, సమావేశాలు ఇక్కడ నుంచే జరగబోతున్నాయట. ఇక ప్రతి బుధవారం రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో గ్రామ పర్యటనకు వెళ్లాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన గ్రామానికి వెళ్లి రాత్రికి అక్కడే పల్లె నిద్ర చేస్తారట. మళ్లీ ఉదయాన్నే అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి గురువారం అక్కడ నుంచి అమరావతి వెళ్తారట. శుక్ర, శని, ఆదివారాలు సీఎం జగన్‌ అమరావతిలో ఉండబోతున్నారు. శుక్రవారం అధికారిక సమావేశాల అనంతరం అవసరమైతే వారాంతంలో అక్కడ నుంచే జిల్లాల పర్యటన చేయనున్నారు. విశాఖకు రాజధాని మార్పునకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చి, అవసరమైన భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు షెడ్యూల్‌ ఇలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రిషికొండలో నిర్మితమవుతున్న సీఎం అధికారిక నివాసం, క్యాంప్‌ ఆఫీస్‌ పూర్తయ్యే వరకు విశాఖలో హార్బర్‌ పార్క్‌ పేరుతో ఉన్న విశాఖ పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్‌ బస చేయబోతున్నారని సమాచారం. సువిశాలమైన ఆవరణలో ఉన్న ఈ గెస్ట్‌ హౌస్‌ లో ఒక వీఐపీ సూట్‌తో పాటు కొన్ని మినీ సూట్లు, వీఐపీ రూమ్స్‌ ఉన్నాయి. చుట్టూ పచ్చదనంతో అవసరమైన పార్కింగ్‌ స్పేస్‌ కూడా ఉంటుంది. భద్రతాపరంగాను ఇది వ్యూహాత్మక ప్రాంతం అన్నది అధికారుల అంచనా. పోర్ట్‌ భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్‌ బలగాల పర్యవేక్షణలో ఈ గెస్ట్‌ హౌస్‌ ఉంటుంది. కేవలం కిలోమీటర్‌ దూరంలో బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. 15 కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌ పోర్ట్‌ ఉంటుంది. అన్ని విధాల అనువైన ప్రాంతంగా దీన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఉగాది తర్వాత విశాఖ నుంచే పరిపాలన అన్న దానిపై అధికార వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు అమర్‌నాథ్‌, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, ధర్మాన ప్రసాదరావు ప్రతి సమావేశంలో వచ్చే నెల నుంచి విశాఖ నుంచి పరిపాలన అంటూ ప్రచారం చేస్తున్నారు. కాగా ఉత్తరాంధ్ర పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఆ ఉపుతో ఉత్తరాంధ్ర జిల్లాలు… విశాఖ కేంద్రంగా రాజధానిని ఆహ్వానిస్తున్నాయని ప్రచారం చేయవచ్చని, తద్వారా విశాఖ నుంచి సీఎం పరిపాలన ప్రారంభించవచ్చనేది వ్యూహం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img