ఇది ఎనిమిదో వింత: సీబీఐ న్యాయవాది
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
మాజీమంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నిబంధనల వ్యవహారంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు.
బెయిల్ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలున్నాయని, సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదించారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇదో 8వ వింత అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒక్కరోజు సమయం ఇచ్చి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తాము కూడా ప్రత్యేక ఎస్ఎల్పీ దాఖలు చేసినట్లు గంగిరెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
గంగిరెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీ, ఇతర పిటిషన్లంటినీ సునీత పిటిషన్కు జత చేయాలని ధర్మాసనం సూచించింది. అన్నింటినీ కలిపి విచారిస్తామంటూ తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.