నియామక సమయానికి మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలను ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎస్బిఐ ఈ మహిళలను ‘‘తాత్కాలికంగా అన్ఫిట్’’ అని పేర్కొందని కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బ్యాంక్ చర్య వివక్షపూరితమైనదని, చట్టవిరుద్ధమని ఆమె అన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని స్వాతి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై వచ్చే మంగళవారం లోగా వివరణ ఇవ్వాలని ఎస్బీఐకి నోటీసులు జారీ చేశాం. ఈ ఉత్తర్వులను ఆమోదించిన అధికారుల పేర్లు కూడా చెప్పాలని అడిగామని స్వాతి ట్విట్టర్లో తెలిపారు. ఈ నోటీసులపై ఎస్బిఐ ఇంకా స్పందించలేదు. కాగా, డిసెంబర్ 31 న ఎస్బిఐ సర్క్యులర్లో మూడు నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను పనిలో చేరకుండా నిలిపివేసింది. గర్భంతో మూడు నెలల కంటే ఎక్కువ ఉంటే, ఆమె తాత్కాలికంగా అనర్హులుగా పరిగణించింది. బిడ్డ ప్రసవించిన తర్వాత నాలుగు నెలలలోపు ఆమెను చేరడానికి అనుమతి ఇచ్చింది.