కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోవా నుంచి హైదరాబాద్కు వస్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు కలబురిగిలోని కమలాపురం వద్ద ఆగి ఉన్న మినీ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. 27 మంది గాయపడ్డారు. గోవాలో గురువారం రాత్రి బయలుదేరిన బస్సు.. కలబురిగి వద్ద శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురయ్యింది. లారీని ఢీకొట్టిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతటికీ వ్యాపించాయి.దీంతో అందులోని ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు. బస్సులోని ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలై ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి బస్సులో డ్రైవర్తోపాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మందిని స్థానికులు రక్షించి వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బీదర్-శ్రీరంగపట్టణం జాతీయరహదారిపై కమలాపుర వద్ద శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తోంది. మృతుల్లో తెలంగాణవాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు