Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

పర్యాటక హబ్‌గా ఏపీ

రూ.2,868 కోట్లతో ప్రాజెక్టుల అభివృద్ధి
48వేల మందికి ఉపాధి
విశాఖలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టు
ముఖ్యప్రదేశాల్లో ఓబెరాయ్‌ విలాస్‌ రిసార్టులు
సమీక్షలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : పర్యాటక రంగానికి ఏపీని చిరునామాగా మార్చాల్సిన అవసరం ఉందని, టూరిజం ప్రదేశాలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం బుధవారం జరిగింది. సీఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయని, వాటన్నింటినీ అభివృద్ధి చేసి, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులను తీర్చిదిద్దాలన్నారు. అత్యాధునిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. విశాఖపట్నానికి లండన్‌ ఐ తరహా ప్రాజెక్టు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో మొత్తం రూ.2868.6 కోట్ల పెట్టుబడులతో భారీ టూరిజం ప్రాజెక్టులు రాబోతున్నాయని, దీనివల్ల 48వేల మందికి ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడిరచారు. వీటివల్ల కొత్తగా 1564 గదులు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఐదేళ్లలో కంపెనీలు వీటిని పూర్తిచేస్తామంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్‌, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్‌ అధ్వర్యంలో రిసార్టులు వస్తున్నాయని తెలిపారు. విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ అధ్వర్యంలో స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్‌, సర్వీసు అపార్ట్‌మెంట్‌, టన్నెల్‌ అక్వేరియం, స్కైటవర్‌ నిర్మాణం జరగబోతున్నాయని, విజయవాడకు హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌ వస్తోందని వివరించారు. అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ చారిటీస్‌ అధ్వర్యంలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రం రాబోతుందని వెల్లడిరచారు. ఇవన్నీ నిర్దేశిత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖమంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికల్‌ వలవన్‌, పర్యాటక, సాంస్కృతికశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె.ప్రవీణ్‌కుమార్‌, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి జి.విజయ్‌కుమార్‌, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి.సృజన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఏడు నుంచి పాపికొండలకు బోటు విహారం
గోదావరినదిలో నవంబరు 7వ తేదీ నుంచి పర్యాటక బోటువిహారం ప్రారంభించనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాకు తెలిపారు. బోటు ప్రయాణానికి రవాణా, భోజన వసతి సహా టికెట్‌ ధర రూ.1,250గా నిర్ణయించినట్లు చెప్పారు. బోటు ఆపరేటర్లతో ప్రత్యేక వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, పర్యాటకుల భద్రతకు కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img