బలవంతంగా కొవిడ్ టీకా ఇవ్వడం తమ ఉద్దేశం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. కొవిడ్ మహమ్మారి వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల అందరి ప్రయోజనాల కోసం అందరూ టీకా వేసుకోవాలని సూచించినట్లు తెలిపింది. అంతేగానీ బలవంతంగా వ్యాక్సిన్ ఇవ్వడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. కొన్నిరకాల సేవలు పొందేందుకు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలన్న నిబంధన నుంచి దివ్యాంగులకు మినహాయిపు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్ర ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎలాంటి సేవలు పొందడానకైనా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలేమీ ఇంతవరకు జారీ చేయలేదని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రమాణపత్రాన్ని దాఖలు చేసింది. ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలని ‘ఎవారా ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని సేవలకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరైన నేపథ్యంలో ఈ టీకా కార్యక్రమానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పటివరకు వారికి సర్టిఫికేట్ చూపించాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇవాల్వని కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరేం కాదని, ఒక వ్యక్తి సమ్మతి లేకుండా టీకాను ఇవ్వలేమని తెలిపింది.