. జనసేన అధినేతకు కమలనాథుల ఆహ్వానం
. దిల్లీ చేరుకున్న పవన్్, మనోహర్
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కాషాయ పార్టీ అధినేతల నుంచి పిలుపు వచ్చింది. దీంతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ సోమవారం హుటాహుటిన దిల్లీ వెళ్లారు. జనసేన నేతలకు దిల్లీ పిలుపుతో ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు దిల్లీ వెళ్లి రావడం, సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమావేశం కావడంతో ముందస్తు ఎన్నికలు ఖాయమని అధికారపార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. పైకి మాత్రం ముఖ్యమంత్రి గడువు ప్రకారమే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని చెపుతున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరగడం ఖాయమని పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ దిల్లీ వెళ్ళి వచ్చిన మూడోరోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా పిలుపురావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో కల్సి జనసేన పోటీ చేయాలని ఒత్తిడి చేయడం కోసమే కమలనాథులు ఆహ్వానించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండగా, దిల్లీ వెళ్లిన పవన్ తొలుత బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులతోపాటు జనసేన, బీజేపీ కార్యాచరణపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలు బాహాటంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేనతో కలిసి ఉన్నా, లేకపోయినా ఒకటేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గతంలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రెండు పార్టీల పెద్దలు ఢల్లీిలో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇంకా కొంతమంది నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిసిన తర్వాత మాట్లాడుతానని వెల్లడిరచారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షులు నడ్డాలతో కూడా వరుస భేటీలు ఉండనున్నట్లు జనసేన నేతలు తెలిపారు.