విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి బుధవారం విచారణ చేపడతామని చెప్పిన సుప్రీంకోర్టు మళ్లీ వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులు విచారిస్తున్నందున ఈ కేసును వాయిదా వేసింది. బుధ, గురువారాల్లో కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై, తుది విచారణలో ఉన్న పిటిషన్లను మాత్రమే వాదనలకు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రత్యేక నిబంధన తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం, రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదా పడిరది. రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్రం సహా మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం, దీనిపై గతంలో విచారణకు వచ్చినప్పుడు ఈనెల 22వ తేదీ విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా సర్క్యులర్, రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ నేపథ్యంలో రాష్ట్ర విభజన కేసుపై తేదీ నిర్ణయించాలని ఉండవల్లి తరపు న్యాయవాది అల్లంకి రమేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు, నియమ నిబంధనలు అవసరమని, ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. న్యాయవాది అల్లంకి రమేశ్ విజ్ఞప్తితో ఏప్రిల్ 11న విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం ప్రకటించింది.