. రూ.319.77 కోట్ల ఆర్థిక సాయం
. ఉపాధిహామీకి మరో 50 దినాలు
. రబీ కరవుపై… కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రబీ కరవు పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్ర బృందం…రాష్ట్రానికి సాయం చేసేందుకు ఉదారంగా స్పందించాలని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ జైన్ కోరారు. విజయవాడ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో శుక్రవారం కేంద్ర కరవు బృందంతో ఆయన సమావేశమై కరవు పరిస్థితులను వివరించారు. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని కరవు ప్రభావిత మండలాల్లో నాలుగు రోజులుగా ఈ కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సీఈఓ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రితేశ్ చౌహాన్ నేతృత్వంలోని సభ్యులు డాక్టర్ పొన్నుస్వామి, సునీలే దుబే, చిన్మయ్ పుండ్లికరావు గోత్కరే, ఆశిశ్ పాండే, అరవింద్ కుమార్ సోని, మన్నూజీ ఉపాధ్యాయ్, ఎస్సీ కశ్యప్, మదన్ మోహన్ మౌర్య, అనురాధ బట్నా, ఎండీ రోణంకి కూర్మనాథ్ బృందం కరవు పరిస్థితులను అధ్యయనం చేసింది. అనంతరం జరిగిన సమావేశంలో కరవు పరిస్థితులను కేంద్ర బృందానికి అజయ్జైన్ వివరించారు. ఆరు జిల్లాల్లో 63 తీవ్ర కరవు మండలాలు, 24మధ్యస్థ కరవు మండలాలుగా ప్రకటించినట్లు చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వర్షాభావం, పంట నష్టం 33శాతం అంతకంటే ఎక్కువ ఉన్న మండలాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కరవు ప్రాంతాలను ప్రకటించిందన్నారు. క్షేత్రస్థాయిలో కరవు నష్టానికి సంబంధించి వాస్తవిక వివరాలను అందించామని, రైతులను ఆదుకోడానికి సత్వరమే రూ.319.77కోట్లు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఉపాధిహామీ పథకం కింద అదనంగా మరో 50పనిరోజులు కల్పించాలని కేంద్ర బృందానికి అజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు. రితేష్ చౌహాన్ మాట్లాడుతూ, కరవు కారణంగా నష్టపోయిన పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడిరచారు. పంట నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనలో కరవు పరిస్థితుల వాస్తవికతను తెలియజేశాయని, క్షత్రస్థాయిలో రైతులు కరవు వల్ల జరిగిన నష్టాన్ని వివరించారని చెప్పారు.
త్వరగా కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సి.హరికిరణ్, పశు సంవర్థక, పంచాయతీరాజ్, మున్సిపల్, భూగర్భ, జలవనరులు తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.