ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
జాతీయవాది చమన్లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందన్నారు. పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, తదనంతర ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ చమన్లాల్ జీ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను మాతృదేశంతో అనుసంధానమయ్యేలా, వారిలో జాతీయతాభావం పెంపొందేలా విశేష కృషిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్, కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్, పలువురు పార్లమెంటు సభ్యులు, తపాలా శాఖ అధికారులు, విశ్వ అధ్యయన కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.