స్థానిక అడ్రస్ మాత్రమే వాడారు..
మాదకద్రవ్యాల కంటైనర్లు దిల్లీకి బుక్ చేసి ఉన్నాయి
ప్రాథమిక నిర్థారణకు వచ్చాం
అయినా దర్యాప్తు కొనసాగిస్తాం..
సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడి
విజయవాడ : సంచలనం సృష్టించిన హెరాయిన్ సరఫరా వ్యవహారంలో విజయవాడకు సంబంధం లేదని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు సోమవారం తెలిపారు. గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కంటెయినర్లతో విజయవాడ నగరానికి సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్న మాదక ద్రవ్యాలను విజయవాడకు తీసుకొచ్చి, ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లుగా వార్తా కథనాలు వెలువడ టంతో.. సదరు అంశంపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చెన్నైలో స్థిరపడిన మాచవరం సుధాకర్ అనే వ్యక్తి తన భార్య గోవిందరాజు దుర్గా పూర్ణ వైశాలి పేరుతో అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొందారని వివరించారు. అయితే, వైశాలి తల్లి గోవిందరాజు తారకకు చెందిన విజయవాడలోని ఇంటి చిరునామా (ఇంటి నంబరు : 23-14-16, గడియారం వారి వీధి, సత్యనారాయణపురం)తో సదరు లైసెన్స్ తీసుకున్నారని తెలిపారు. హెరాయిన్ దిగుమతి సంస్థ అడ్రసు విజయవాడ నగరానికి చెందినది కావడం తప్ప, మిగిలిన విషయాలన్నీ వాస్తవం కాదని, సుధాకర్, వైశాలి దంపతులు చాలా ఏళ్ల క్రితమే చెన్నైలో స్థిరపడ్డారని పోలీసు కమిషనర్ చెప్పారు. టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన హెరాయిన్ విజయవాడ నగరానికి తరలించేవారని వెలువడిన వార్తలు నిజం కాదని ఆయన వెల్లడిరచారు. పట్టుబడ్డ హెరాయిన్ కంటెయినర్లు దిల్లీకి బుక్ చేసి ఉన్నాయని వివరించారు. ఫారిన్ ట్రేడ్ లైసెన్స్ కోసం వినియోగించుకున్న ఇంటి చిరునామా తప్ప, అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి అయిన మాదక ద్రవ్యాలతో విజయవాడ నగరానికి ఏ విధమైన సంబంధం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సీపీ ప్రకటించారు. అయినప్పటికీ సంచలనం రేకెత్తించిన ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.