న్యూదిల్లీ: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల సత్వర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హోలీ సెలవుల అనంతరం విచారణ చేపడతామని బుధవారం స్పష్టం చేసింది. హిజాబ్ అనేది తప్పనిసరి కాదని, కళాశాలల నిర్ణయం మేరకు యూనిఫాం తప్పనిసరి అని పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థినుల తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే సుప్రీంలో సవాలు చేశారు. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సంజయ్ హొగ్డే వాదనలు వినిపిస్తూ విద్యార్థులకు త్వరలోనే పరీక్షలు ఉన్నాయని, తమ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. న్యాయవాది వాదనలతో తాము ఏకీభవిస్తున్నామని చెప్పిన ధర్మాసనం…ఇందుకుగాను తమకు కొంత సమయం ఇవ్వాలని, హోలీ సెలవుల అనంతరం విచారణల జాబితాలోకి ఈ పిటిషన్ను చేరుస్తామని పేర్కొంది. కర్ణాటకలోని ఉడిపి ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ మహిళా కళాశాలకు చెందిన ముస్లిం విద్యార్థినులు తమను హిజాబ్తో తరగతి గదుల్లోకి అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.