Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యపై సీఎంతో చర్చిస్తా

ప్రొఫెసర్ కోదండరాం

విశాలాంధ్ర, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. మంగళవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, చాలాకాలంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అంశంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కొంత సానుకూలంగా ఉందని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకు వెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, ముఖ్యంగా చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ సాధనలో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఒకటి రెండు చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, తిరిగి తీసుకున్న సంఘటనలు ఉన్నాయని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమస్య సానుకూలంగా పరిష్కారం జరిగే విధంగా త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే అంశంపై తనవంతు కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి(డీసీఓ) డి.రమాదేవి మాట్లాడుతూ, తమ శాఖ తరఫున జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. 2008 లో స్థాపించిన ఈ సొసైటీ లోని సభ్యులందరూ బాధ్యతగా ఉండాలని, సొసైటీ బైలా చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి నగర అధ్యక్షుడు నర్సయ్య, సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, కోశాధికారి పిల్లి రాంచందర్, కార్యవర్గ సభ్యులు యర్రమిల్లి రామారావు, భాస్కర్ రెడ్డి, వీరేశం, సీనియర్ జర్నలిస్టులు పులిపలుపుల ఆనందం, షోయబుల్లాఖాన్, బీఆర్ కే మూర్తి,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img