జపాన్: ప్రపంచ మానవ చరిత్రలోనే కారుచీకటి రోజైన 1945, ఆగస్టు 6న హిరోషిమాపై అణుబాంబు దాడిజరిగి 76ఏళ్లు పూర్తయిన సందర్భంగా..అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించడానికి ఏకం కావాలని జపాన్ నగర మేయర్ ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు. మానవాళికి పెనుముప్పుగా గుర్తించే కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నంత తీవ్రంగా అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉండాలని ప్రపంచ నాయకులను జపాన్ మేజర్ కజుమి మాట్సుయ్ కోరారు. సంపూర్ణ వినాశనానికి పెను ముప్పుగా ఉన్న అణ్వాయుధాలను అన్ని దేశాలు కలిసి..ఖచ్చితంగా నిర్మూలించాలని అన్నారు. జపాన్ నగరమైన హిరోషిమాపై అమెరికన్లు 1945 ఆగస్టు 6న అణ్వాయుధ బాంబు దాడి జరిపింది. ఈ ఘటనలో 140,000 మంది మృతిచెందారు. మూడు రోజుల తర్వాత నాగసాకిపై రెండవ బాంబును వేసింది. ఈ దాడిలో 70,000 మంది మృతిచెందారు. తర్వాత రోజుల్లో ధార్మిక కిరణాల దుష్ప్రభావంతో 2లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. ఆగస్టు 12న జపాన్ లొంగిపోయినట్లుగా ప్రకటించింది. అణ్యాయుధాల నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒప్పందం జనవరి నుండి అమలులోకి వచ్చింది. అణుబాంబుల దాడినుండి బైటపడినవారి అనేక సంవత్సరాల ప్రయత్నాల అనంతరం ఈ ఒప్పందం చోటుచేసుకుంది. 50కిపైగా దేశాలు దీనిని ఆమోదించినప్పటికీ ఒప్పందం ముగిసినప్పటినుండి అమెరికా మరికొన్ని దేశాలతోపాటు జపాన్కూడా ఈ జాబితాలో లేదు. జపాన్ పూర్తిగా తన రక్షణ కోసం అమెరికాపై ఆధారపడటం ఇక్కడి ప్రధాన విషయం. అణుబాంబు దాడిలో బైటపడిన వారి చిరకాలకోరికను నేరవేర్చడానకి మాట్సుయ్ ఈ ఒప్పందాన్ని తాజాగా ఆమోదించి చర్చలో పాల్గొనాలన్న తన డిమాండ్ను పునరుద్ధరించారు. అణ్వాయుధాలు కలిగిన, అణ్వాయుధాలు లేని దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని జపాన్ను ఆయన కోరారు. ఈ ఒప్పందంపై జపాన్తో సహా అత్యధిక దేశాలు సంతకం చేశాయి.