టోక్యో : తూర్పు ఆసియా దేశమైన జపాన్ ప్రధానమంత్రి యోషిషిడే సుగా అనూహ్యంగా అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వ రేసు నుండి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దీనితో ఆయన ప్రధాని పదవీ బాధ్యతల నుండి వైదొలగనున్నారు. అనారోగ్యం కారణంగా గత సెప్టెంబరులో షింజో అబే రాజీనామా చేయడంతో బాధ్యతలు స్వీకరించిన సుగా కరోనా నియంత్రణలో విఫలమయ్యారు. దీనితో ఆయన రేటింగ్ 30శాతం కంటే దిగువకు పడిపోయింది. దీనితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి తాను ప్రధాని పదవికి పోటీచేసే ప్రసక్తిలేదన్నారు. అక్టోబరు మొదటి లేదా రెండవ వారంలో నూతన ప్రధాని ఎంపిక పూర్తికావచ్చునని తెలుస్తోంది. జపాన్లో కరోనా కేసులు ఇప్పటివరకు 15లక్షలు నమోదయ్యాయి. వాక్సినేషన్ ప్రక్రియ కూడా మందకొడిగా సాగుతోంది. కరోనా వైరస్ నియంత్రణలో తాను శ్రమించానని సుగా తెలిపారు. ఎన్నికలకు వెళ్లాలా..వైరస్ నియంత్రించాలా ఈరెండిరటిని తానుచేయలేనని సుగా పేర్కొన్నారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణతో జపాన్ ప్రభుత్వంపై ప్రతికూలత వచ్చింది. సుగా తీసుకున్న తాజా నిర్ణయంతో లిబరల్ డెమోక్రటిక్పార్టీ కార్యదర్శి తొషిహిరో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.