కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) అధికారాలను తగ్గించే విధంగా ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదన క్రమంలో పార్లమెంటు కీలక బిల్లును ఆమోదించింది. సీజే అధికారాలకు కత్తెర వేసే విధంగా చట్టాలు చేయకపోతే చరిత్ర మమ్మల్ని క్షమించదు అని షరీఫ్ పార్లమెంటుకు సూచించారు. కాగా, సుమోటో కేసులు, రాజ్యాంగ సంబంధ ధర్మాసనాలపై నిర్ణయాలకు సంబంధించి సీజేకున్న సంపూర్ణ అధికారాలను తగ్గించేందుకు ‘ది సుప్రీం కోర్టు (ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్) బిల్లు-2023’కు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇకపై ఏదేని అంశాన్ని సుమోటోగా స్వీకరించే విషయమై ముగ్గురు సీనియర్ న్యాయమూర్తుల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో సీజే ఒక సభ్యుడిగా ఉంటారు. ఇప్పటివరకూ ఈ అధికారం సీజే ఒక్కరికే ఉండేది. అలాగే రాజ్యాంగాన్ని వివరించాల్సిన అవసరమున్న కేసుల విచారణకు ధర్మాసనంలో ఐదుగురు లేదా విస్తృత ధర్మాసనం ఉండాలన్న నిబంధనను చేర్చారు. ఈ బిల్లును పాకిస్తాన్ కేబినెట్ మంగళవారం ఆమోదించింది.