గ్రీస్ : పాలక ఎన్డీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రీస్లో వేలాదిమంది నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజలు మాత్రమే ప్రజలను రక్షించగలరు. ప్రజలు పోరాట శక్తిగా మారాలి అంటూ నిరసనకారులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. 85 వ థెస్సలోనికి ఇంటర్నేషనల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆల్ వర్కర్స్ మిలిటెంట్ ఫ్రంట్ (పీఏఎమ్ఈ) ట్రేడ్యూనియన్లు నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాదిమంది కార్మికులు, స్వయం ఉపాధికారులు, రైతులు, పెన్షనర్లు, యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు వైఎమ్సీఏ స్వ్కేర్ వద్ద సమావేశమై సిటీ సెంటర్ మీదుగా బ్యానర్లు చేతపట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రజలు భయపెట్టేందుకు ప్రభుత్వం డ్రోన్లతో సహా 5000 మంది పొలీసు బలగాలను మోహరించింది. ఈ ర్యాలీలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ గ్రీస్ (కేకేఈ) ప్రధాన కార్యదర్శి డిమిట్రిస్ కౌట్సౌంబస్ ప్రసంగించారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు నగరాలు, గ్రామీణ ప్రాంతాల స్వయం ఉపాధికార్మికులకు తమ హక్కుల సాధనకు ఏకైక మార్గం పోరాటమే.. కార్మిక సంబంధాలను నీరుగార్చడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జరిగే పోరాటాలకు కేకేఈ తన సంఫీుభావాన్ని ప్రకటిస్తుందన్నారు.