ఇద్దరు మృతి – ఐదుగురికి గాయాలు : 157 రోజుల్లో 279వ ఘటన
వర్జీనియా: అమెరికాలో తుపాకీ సంస్కృతి తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం 157 రోజులలో 279 సామూహిక కాల్చివేత ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా వర్జీనియా హైస్కూలులో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో ఇద్దరు చనిపోగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రిచ్మండ్లోని హైస్కూలులో ఓ సాయుధుడు చొరబడి నాలుగు హాండ్గన్స్తో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 19ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు రిచ్మండ్ పోలీస్ చీఫ్ రిక్ ఎడ్వర్డ్స్ చెప్పారు. ఇది హేయమైన నేరమన్నారు.ఒకరిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో జనసమూహంలో తుపాకీతో రెచ్చిపోయాడని అన్నారు. మృతులను 18, 36 ఏళ్ల వ్యక్తులుగా గుర్తించామన్నారు. వాళ్లిదర్దు తండ్రీ కొడకుగా వార్తలు రాగా ఎడ్వర్డ్స్ ధ్రువీకరించలేదు. గాయపడిన వారిలో 14, 32, 55, 58, 31 ఏళ్ల వ్యక్తులు ఉండగా వీరిలో 31ఏళ్ల వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎడ్వర్డ్స్ తెలిపారు. జనం భయంతో పరుగులు తీసిన నేపథ్యంలో ఓ తొమ్మిదేళ్ల బాలిక కారు కింద పడిరదని, మరికొందరు తొక్కిసలాటలో గాయపడ్డారని ఆయన చెప్పారు.