ఆహారం కన్నా నీరే ఖరీదు
గంట మాత్రమే విద్యుత్తు
బీరుట్ : పశ్చిమాసియా దేశమైన లెబనాన్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఆహారం కంటే నీరు 8 రెట్లు ఖరీదైంది. ఆహార పదార్ధాలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుకు గంట మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతో ంది. ఆరోగ్య సేవలు ఆస్తవ్యస్తంగా మారాయి. పాఠశాలలు పూర్తిగా మూతబడ్డాయి. ఈ సమస్యల మధ్యే లెబనాన్లో నూతన ప్రధాన మంత్రిగా నజీబ్ మికటి బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో కూడా ఈ పదవిలో కొనసాగారు. గత ఏడాది బీరుట్లో పేలుడు ఘటనతో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. 1,000 లెబనీస్ పౌండ్లకు లభ్యమైన లీటర్ డీజిల్, పెట్రోలు ఇప్పుడు 6,500 లెబనీస్ పౌండ్లుగా మారింది. 150 ఏళ్లలో లెబనాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధ్వాన స్థితిలో ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. జనాభాలో 78 శాతం మంది పేదరికాన్ని ఎదుర్కొం టున్నారు. గత రెండు సంవత్సరాల్లో మరింతగా దిగజారింది. దేశంలో నిరసనలు భగ్గుమంటున్నాయి. అల్లర్లు జరుగుతున్నాయి. ఉత్తర నగరం ట్రిపోలీ, ఇతర ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంక్షోభం గందరగోళ పరిస్థితులకు దారితీయవచ్చునని నిపుణుల అంచనా. మనుగడ కోసం ప్రజలు దేనికైనా తెగబడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.