విశాలాంధ్ర`పెద్దకడబూరు : రాష్ట్ర స్థాయి పోటీలకు పెద్దకడబూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన శ్రీకాంత్, వీరాంజినేయులు, జయశాలి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి మాట్లాడుతూ మంగళవారం కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియం నందు అండర్ 14,17 విభాగాలలో జిల్లా స్థాయి పోటీలు జరిగాయన్నారు. శ్రీకాంత్ 400 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం, 600 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానం సాధించాడన్నారు. అలాగే జయశాలి షాట్ పుట్ లో రెండో స్థానం కైవసం చేసుకొందని తెలిపారు. వీరాంజినేయులు 200 మీటర్ల పరుగు పందెంలో మూడో స్థానం కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు వచ్చే నెలలో శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పీడీ స్వర్ణలత, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఎంపీపీ శ్రీ విద్య,జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి, సర్పంచ్ రామాంజనేయులు, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, ఉప సర్పంచ్ విజయేంద్ర రెడ్డి, పాఠశాల విద్యాకమిటి చైర్మన్ అనిల్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.