న్యూదిల్లీ : పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు సంబంధించి ప్రణాళికను రూపొందించడానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జూన్ 24వ తేదీన సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో సమావేశం జరుగుతుంది. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా, రాజకీయ పరిస్థితులపై సమావేశం చర్చిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులు సలహాలు, సూచనలు చేస్తారని పేర్కొన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులపైనా సమావేశం చర్చిస్తుందని తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులైలో జరుగుతాయని భావిస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ ఆందోళనపై దృష్టి సారించింది..