Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రచనలే జీవితంగా భావించే రస్కిన్‌ బాండ్‌

రస్కిన్‌ బాండ్‌. ఈ పేరు వినని సాహితీప్రియులు ఉండరు. ఆయన స్వతహాగా ఆంగ్లంలో రాసినప్పటికీ ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోకి వారి రచనలు అనువాదాలు జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. ఇంగ్లీష్‌ పాఠ్యగ్రంథంలో ఎక్కడో ఓ చోట బాండ్‌ ఒక్క కథనో, వ్యాసమో చదివే ఉంటాము. ఇక సి.బి.ఎస్‌.సి., ఐ.సి.ఎస్‌.ఇ. సిలబస్‌లు చదివి వచ్చిన యువత గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన రాసిన అనేక కథల పుస్తకాల్ని చదువుకుంటూ పోతూనే ఉంటారు. జీవితంలో ఒక భాగమై ఆయన పేరు మీద అనేక గ్రూపులు ఆన్‌లైన్‌లో నడుపుతుంటారు. ఈ మేగజైన్‌ కూడ ఉంది. కథని ప్రేమించే మనిషికి ఆయన కథ తగిలితే చాలు ఇక అక్కడితో ఆగలేరు.
మరి ఇంతాచేసి ఈ రస్కిన్‌బాండ్‌ ఎవరు..? చిన్నపిల్లలు, యువతరం, పెద్దతరం అందరినీ తనదైన ప్రత్యేక కథన కుతూహలంతో అలరించే ఈయన ముస్సోరి అనే పట్టణంలో, హిమాలయ సానువుల్లో, ఆ కొండల్లో ఎన్నో దశాబ్దాల నుంచి జీవిస్తూ అక్కడి తన అనుభవాలనే గాక ఇంకా తన జీవితంలోని ఎన్నో అనుభవాలను కథల రూపంలో రాస్తూ ఇప్పటికీ 100 పుస్తకాల కి పైగా వెలువరించాడు. ప్రస్తుతం ఎనభైవ పడిలో ఉన్నాడు. జన్మతః ఆంగ్లేయ దంపతులకి పుట్టినప్పటికి భారతదేశాన్ని తన ఆవాసంగా చేసుకుని ఇక్కడే ఉండిపోయాడు. తన అసలు పేరు ఓవెన్‌ రస్కిన్‌ బాండ్‌, 1934లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాసులి అనే ఊరిలో జన్మించాడు.
ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి అప్పటి ఒక భారతీయ సంస్థానాధీశుణ్ణి రెండో వివాహం చేసుకోవడంతో, ఎక్కువగా తండ్రి వద్దనే పెరిగాడు. బ్రిటీష్‌ ఆర్మీలో పనిచేసే అతను అనేక ప్రాంతాలు తిరిగేవాడు. బాండ్‌ కూడా తండ్రితో పాటూ తిరిగాడు. యవ్వనదశకి ముందే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తనది ఒకరకమైన అనాధ జీవితమే అయింది. స్నేహితుల సాయంతోనూ, చిన్న చిన్న పనులతోనూ తనని తాను పోషించుకున్నాడు. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన తరువాత తన బంధువులు, తెలిసినవాళ్ళు చాలామంది ఇంగ్లండ్‌కి వెళ్ళిపోయారు. అయితే తాను మటుకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
రచయితగా మాత్రమే జీవించాలని కంకణం కట్టుకున్నా, అది ఇండియాలో చాలా కష్టమని తెలిసింది. ట్యూషన్స్‌ చెప్పినా, స్వచ్చంద సంస్థలో పనిచేసినా దానికోసమే. మొత్తానికి రమారమి 70 ఏళ్ళపాటు రచనారంగంలో ఉండి 100 కథల పుస్తకాల్ని ఇప్పటిదాకా రాశాడు. లెక్కలేనన్ని వ్యాసాలు, ఇతర ప్రక్రియలు చేపట్టాడు. మరి ఇన్నేళ్ళ తన జీవితంలో తాను పొందిన తీపి, చేదు అనుభవాలు అన్నిటినీ కలిపి రస్కిన్‌ బాండ్‌ తన ఆత్మకథని రాసుకున్నాడు దాని పేరు ూశీఅవ ఖీశీఞ ణaఅషఱఅస్త్ర ,రెందువందల ఎనభై పేజీలు. స్పీకింగ్‌ టైగర్స్‌ వాళ్ళు ప్రచురించారు. ప్రతి ఒక్క రచయిత లేదా రచయిత కాదలుచుకున్న వ్యక్తి తప్పక చదవాలి.
ఈ ఆటోబయోగ్రఫీ చదవడం వల్ల మనకి రస్కిన్‌ బాండ్‌ యొక్క జీవితగాథ తెలియడమే కాదు. దానితో బాటు అనేక విషయాలు తెలుస్తాయి. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో పనిచేయడానికి వచ్చిన అనేకరకాల మనుషుల మంచీ చెడు తెలుస్తాయి. వాళ్ళ వ్యామోహాలు, ఉద్యోగధర్మంగా వాళ్ళు చేసిన పనులు, వాటి పర్యవసానాలు తెలుస్తాయి. అంతేకాకుండా స్థానిక ప్రజలతో వాళ్ళ అనుబంధాలు తెలుస్తాయి. ముఖ్యంగా సింలా, డెహ్రాడూన్‌, జాంనగర్‌, లక్నో వంటి ప్రాంతాల్లో నాటి నేటివ్‌ బ్రిటిషర్స్‌ ఎలా జీవించేవారు, రోజువారి జీవితంలోని పదనిసలు ఇప్పుడు చదువుతుంటే ఆసక్తిగా అనిపిస్తాయి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలామంది బ్రిటిషర్లు ఇక్కడ ఉండడంలో ఇన్సెక్యూరిటీ ఫీలయ్యి ఇంగ్లండ్‌కి వెళ్ళిపోయారని రస్కిన్‌ బాండ్‌ చెబుతాడు. తాను నాలుగుఏళ్ళు లండన్‌ వెళ్ళి కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించి తనకి ఇండియానే బాగుందనిపించి మళ్ళీ వెనక్కి వస్తాడు. దానికి కారణం చెబుతూ హిమాలయ సానువుల్లోని ఆ గుట్టల్లోనూ, చెట్లలోనూ, ఉండి ఉండి అవి నాలో ఓ భాగమయిపోయాయి. ఆ తర్వాత ఢల్లీిలోనూ, బొంబాయిలోనూ ఉండాల్సి వచ్చినా అది తనవల్లగాదని ముస్సోరిలోనే స్థిరపడ్డాడు. అక్కడ నుంచే తన రచనాయాత్రని సాగించాడు. అప్పటికి ఆ ఊరు చాలా చిన్నది. తన మొట్టమొదటి నవల ుష్ట్రవ Rశీశీఎ శీఅ ్‌ష్ట్రవ Rశీశీట ఇలస్ట్రేటడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియాలో సీరియలైజ్‌ అయినప్పుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. దాన్ని ఎవరికైనా చూపించి శభాష్‌ అనిపించు కోవాలన్నా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆ చుట్టూతా ఎవరూ ఉండరు.
ఢల్లీిలో ఉన్న కుష్వంత్‌ సింగ్‌ తనని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు ఒకసారి, తన రచనల్ని బాగా ప్రోత్సహించేవాడని రస్కిన్‌ బాండ్‌ రాసుకున్నాడు. మెల్లిగా స్వదేశీ, విదేశీ ఇంగ్లీష్‌ పత్రికల్లో రాయడం మొదలుపెట్టి తనకంటూ ఓ స్థాయిని సంపాదించుకుంటాడు. ఆ తర్వాత ఇంప్రింట్‌ అనే పత్రికకి సహ సంపాదకునిగా ఆర్‌.వి.పండిట్‌ కోరిక మీద పనిచేశాడు. ఎమర్జెన్సీ టైంలో ఆ పండిట్‌ మీద అప్పటి ప్రభుత్వానికి ఉన్న కోపంవల్ల ఓ చిన్న కేసులో ఇరు క్కుంటాడు. అయితే ఈజీగానే దానిలోనుంచి బయట బడి తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించాడు.
ఇప్పుడు మాదిరిగా అప్పట్లో రచయితలకి పబ్లిసిటీ లేదని, తాను ఓసారి బిబిసిలో ప్రొగ్రాం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్రాహం గ్రీన్‌ తన పక్కనే కూర్చున్నా తాను గుర్తించలేదని, ఆ తర్వాత ఎవరో తనకి చెప్పడంతో ఖంగుతిన్నానని అంటాడు. అయితే ఎర్నెస్ట్‌ హెమింగ్వెయ్‌ లాంటి వాళ్ళు వేరు. పబ్లిసిటీ కోసం ఏవో చేస్తుండేవారని అంటాడు. ఇలా ఎన్నో విషయాల్ని తనకి తారసపడిన సంఘటనల్ని అక్షరబద్ధం చేశాడు. 50 ఫోటోలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అవి అన్నీ ఎన్నో నాటి సంగతులని వివరిస్తాయి. ముస్సోరిలో ఉండే రస్కిన్‌ బాండ్‌ని కలవడానికి ఎంతోమంది అభిమానులు వస్తుంటారు.
అక్కడ ఉండే కేంబ్రిడ్జ్‌ బుక్‌ హౌస్‌ అనే పుస్తకాల షాప్‌లో వాళ్ళందర్నీ ప్రతి శుక్రవారం కలుస్తుంటాడు. ఇంట్లో మాత్రం ఎవరినీ కలవడాయన. దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. బెంగాల్‌ నుంచి ఓ రచయిత్రి చాన్నాళ్ళ క్రితం ఈయన ఇంటికి వచ్చి తప్పనిసరిగా తన పుస్తకానికి ముందుమాట రాయవలసిందే అని కూర్చుందట. నేను కొద్దిగా పనిలో ఉన్నా, స్క్రిప్ట్‌ ఇచ్చి వెళ్ళమంటే నానాయాగీ చేసిందట. సరె…ఎవరి అనుభవాలు వాళ్ళవి. మన ఆర్‌.కె.నారాయణ్‌ గారు జీవించి ఉన్న రోజుల్లో అభిమానుల్ని ఇంట్లో కాకుండా బయటనే ఎక్కువ కలిసేవారని చదివాను. ఆయనకి లభించిన అవార్డులు ఎన్నో, సాహిత్య అకాడెమీ అవార్డ్‌తో పాటు…భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ లాంటి పురస్కారాలు ఇచ్చి సత్కరించింది. రస్కిన్‌ బాండ్‌ అనే పేరు దేశ విదేశాల్లో విన్నుత్నమైన కథకి మరో రూపంగా అవతరించింది. అనేక అనుభవాల సమాహారంగా ఉన్న ఈ ఆటోబయోగ్రఫీ ప్రస్తుతం అమెజాన్‌లో లభ్యమవుతోంది.

  • మూర్తి కెవివిఎస్‌, 78935 41003,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img