న్యూదిల్లీ : కోవిడ్పై పోరులో ప్రపంచ దేశాలు ఏకమవుతున్నాగానీ వాక్సినేషన్ విషయంలో వాటి మధ్య అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా, భారత్ వంటి దేశాలు తమ పౌరులకు టీకాలు అందించే విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంటే ఆఫ్రికాలో వాక్సిన్ జాడే లేని దుస్థితి నెలకొంది. భారత్ జనాభా అధికంగా ఉన్నాగానీ వాక్సిన్ల పంపిణీలో దూకుడు ప్రదర్శిస్తోంది. అవర్ వరల్డ్ డేటా ప్రకారం 1.02 బిలియన్ వాక్సిన్ డోసులు అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 15శాతం టీకాలను అక్టోబరు 25 నాటికి భారత్ అందించింది. పూర్తిగా వాక్సినేషన్ జరిగిన జనాభాతో పోల్చితే ఇది కాస్త తక్కువ. ఐరాస జనాభా విభజనలో భారత్ వాటా 17.7శాతం కాగా ఈ లక్ష్యానికి చేరువలోనే ఉపఖండం ఉంది. కోవిడ్19పై పోరులో భారత్ మరిన్ని మైలురాళ్లను దాటుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనాభా అధికంగా ఉండటం వనరులు అరకొరగా ఉండటంతో యావత్ ప్రజానికానికి కోవిడ్ నుంచి రక్షణ కల్పించడం భారత్కు సవాలే. ఇప్పటికే బిలియన్ డోసుల పంపిణీతో భారత్ జనాభాలో 35శాతం మంది రెండు టీకాలను పొందినట్లు అయింది. ఆస్ట్రాజెనకా / కోవిషీల్డ్ వాక్సిన్ల కోసం నిరీక్షణ తప్పక రెండవ మోతాదు కోసం చాలా మంది పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే రెండు టీకాలు తీసుకున్న వారి సంఖ్య 22శాతానికి చేరువలో ఉంది. మరోవైపు చైనా దేశం దాదాపు 2.25 బిలియన్ డోసులను పంపిణీ చేసింది. అంటే తమ ప్రపంచ జనాభా వాటాలో 80శాతానికి టీకాలు అందించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా తమ న్యాయమైన వాటాకు మించి (40
50శాతం) టీకాలు అందించాయి. మరోవైపు ఆఫ్రికా ఖండాన్ని కోవిడ్ వాక్సిన్ల కొరత వెంటాడుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 17.4శాతం మంది ఆఫ్రికాలో ఉంటే వారిలో కనీసం మూడు శాతం మంది కూడా వాక్సినేషన్కు నోచుకోలేదు. ప్రపంచ జనాభాలో తమ వాటాకు అనుగుణంగా ఏ దేశమైన టీకాలు అందిస్తే అక్కడి వారిలో దాదాపు 50శాతం మందికి కోవిడ్ టీకాలు అందుతాయి. రెట్టింపు డోసులతో ప్రపంచ జనాభా పూర్తిగా వాక్సినేటయ్యే ఆస్కారం ఉంటుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్లో రెండు డోసులు తీసుకున్న వారు 55`65 శాతంగా ఉంటే చైనాలో 80శాతానికిపైగానే ఉండటాన్ని బట్టి వాక్సినేషన్లో దేశాల మధ్య తేడా స్పష్టమవుతోంది.