పైలట్లు అంటే ఎంతో అప్రమతంగా ఉండాలి. వేల అడుగుల ఎత్తులో విమానాలు ఎగురుతున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే ఇద్దరు పైలట్లు ఆకాశంలో విమానం వెళ్తున్నప్పుడు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వివరాల్లోకి వెళితే, బోయింగ్ 737 విమానం సుడాన్లోని ఖర్టౌమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు బయల్దేరింది. విమానం 37 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఆటోపైలట్ మోడ్లో పెట్టిన పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. విమానం ఎయిర్పోర్టుకు చేరువగా రావడంతో.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పైలట్లను అలర్ట్ చేసింది. కానీ వారి నుంచి స్పందన రాలేదు. ఎన్నిసార్లు అలర్ట్ చేసినా ఫలితం లేకపోయింది. ఫ్లైట్ దిగాల్సిన విమానాశ్రయం రన్వే మీదుగా వెళ్లిపోయాక.. ఆటోపైలట్ మోడ్ డిస్కనెక్ట్ అయ్యింది. దీంతో అలారం మోగడంతో పైలట్లు ఉలిక్కి పడి నిద్ర లేచారు. విమానాన్ని వెనక్కి మళ్లించి… 25 నిమిషాలు ఆలస్యంగా సేఫ్గా రన్ వే మీద దించారు. పైలట్లు నిద్రలో ఉన్నప్పటికీ.. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.విమానం రన్ వే మీదుగా గాల్లో ప్రయాణించిన విషయాన్ని ఏవియేషన్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏడీఎస్-బి డేటా ధ్రువీకరించింది. ఎయిర్క్రాఫ్ట్ ప్రయాణ మార్గానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఏవియేషన్ అనలిస్ట్ అలెక్స్ మాచెరస్ ట్విట్టర్లో పోస్టు చేశారు. పైలట్ల తీరుపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.